తెలంగాణలో ఇంటర్ బోర్డు పరిధిలో నిరభ్యంతర పత్రం (NOC) సమర్పించకపోవడం వల్ల ఫీజు చెల్లించలేకపోయిన దాదాపు 217 కళాశాలల్లోని సుమారు 50 వేల మంది ఇంటర్ విద్యార్థులకు హైకోర్టు నుంచి ఊరట దక్కింది. ఇంటర్ పరీక్ష ఫీజును రూ.2,500 ఆలస్య రుసుంతో చెల్లించేందుకు శనివారం (జనవరి 25) చివరితేదీ కాగా.. ఈ ఆలస్య రుసుం లేకుండానే చెల్లించేందుకు అనుమతించాలని ఇంటర్ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
అసలేం జరిగింది?
రాష్ట్రంలో గుర్తింపు పొందని కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ.. ఒక్కొక్కరికీ రూ.2,500 చొప్పున బ్యాంకు గ్యారంటీని సమర్పించాలని ఆయా కళాశాలల యాజమాన్యాలను హైకోర్టు ఆదేశించింది. కళాశాలలు నిరభ్యంతర పత్రం సమర్పించడానికి తగినంత గడువు ఇచ్చినప్పటికీ.. నిర్లక్ష్యంగా వ్యవహరించి సకాలంలో విద్యార్థులకు ఫీజు చెల్లించడానికి అవకాశం ఇవ్వలేదని, ప్రస్తుతం ఇంటర్ బోర్డు విధించిన రూ.లక్ష జరిమానా మొత్తానికి మినహాయింపు ఇవ్వాలంటూ తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ టి.వినోద్ కుమార్ విచారణ చేపట్టారు.

ప్రస్తుతం గుర్తింపులేని ఈ కాలేజీల్లో ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులను మార్చిలో పరీక్షలకు అనుమతించడానికిగాను ప్రభుత్వం విధించిన జరిమానా చెల్లిస్తామని, విద్యార్థులకు ఆలస్య రుసుం రూ.2,500 మినహాయించాలని కోరుతున్నాయన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఫీజును అనుమతించాలని అధికారులను ఆదేశించారు. అయితే ఆయా కాలేజీలు ప్రభుత్వం విధించిన జరిమానాను 25 లోగా చెల్లించాల్సి ఉందన్నారు.