ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా, డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతున్నది. ఒక మ్యాచ్ గెలుస్తూ, మరో మ్యాచ్లో ఓడుతున్న కోల్కతా మళ్లీ అదే పంథాను అనుసరించింది. సొంత ఇలాఖాలో కోల్కతాకు మరోమారు చుక్కెదురైంది. సోమవారం ఈడెన్గార్డెన్స్లో జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్(జీటీ) 39 పరుగుల తేడాతో కోల్కతాపై ఘన విజయం సాధించింది. తొలుత కెప్టెన్ శుభ్మన్ గిల్(55 బంతుల్లో 90, 10ఫోర్లు, 3సిక్స్లు) ధనాధన్ అర్ధసెంచరీకి తోడు సాయి సుదర్శన్(36 బంతుల్లో 52, 6ఫోర్లు, సిక్స్) సమయోచిత ఇన్నింగ్స్తో గుజరాత్ 20 ఓవర్లలో 198/3 స్కోరు చేసింది. వీరిద్దరు తొలి వికెట్కు 114 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.అరోరా, రానా, రస్సెల్ ఒక్కో వికెట్ తీశారు. లక్ష్యఛేదనలో కోల్కతా 20 ఓవర్లలో 159/8 స్కోరు చేసింది. కెప్టెన్ రహానే(50) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ఖాన్ రెండేసి వికెట్లతో కోల్కతా పతనంలో కీలకమయ్యారు.
పెవిలియన్
నిర్దేశిత లక్ష్యఛేదనలో కోల్కతా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న వికెట్కీపర్, బ్యాటర్ గుర్బాజ్( 1) ఘోరంగా విఫలం కాగా, నరైన్ (17), వెంకటేశ్ (14), రింకూసింగ్ (17), రస్సెల్ (21), రమణ్దీప్సింగ్(1), అలీ(0) తీవ్రంగా నిరాశపరిచారు. చెత్త షాట్లకు పోయిన కోల్కతా బ్యాటర్లు మూ ల్యం చెల్లించుకున్నారు. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లు పెవిలియన్కు క్యూ కట్టడంతో సాధించాల్సిన రన్రేట్ అంతకంతకూ పెరుగుతూ పోయింది. ఇదే అదనుగా గుజరాత్ బౌలర్లు ఒత్తిడి పెంచడంతో కోల్కతా బ్యాటర్లు నిలదొక్కుకోలేకపోయారు. ఆఖర్లో రఘువంశీ(27 నాటౌట్) ఒంటరి పోరాటం జట్టును గెలిపించలేకపోయింది.

ఏకాగ్రత
మ్యాచ్ అనంతరం ఓటమిపై నిరాశ వ్యక్తం చేశాడు కెప్టెన్ అజింక్యా రహానె. అతడు మాట్లాడుతూ “199 పరుగుల లక్ష్యం ఛేధించదగినదే. బౌలింగ్తో మేము మ్యాచ్లోకి తిరిగి అద్భుతంగా పుంజుకున్నాం. పెద్ద లక్ష్యం ఛేదంచేటప్పుడు, ఓపెనింగ్ లోనే మంచి ఆరంభం అవసరం. అందుకే ఈ టోర్నమెంట్ లో మేం ఇబ్బంది పడుతున్నాం. ఈ పిచ్పై 199 ఛేధించడం సాధ్యమేనని అనిపించింది. బౌలింగ్ అద్భుతంగా చేశాం కానీ, మా బ్యాటింగ్ విఫలమైంది. త్వరగా తప్పులను సరిచేసుకుని, ముందుకు సాగాలి. పిచ్ కాస్త నెమ్మదిగా ఉంది, కానీ 200 కన్నా తక్కువ పరుగులకు వారిని కట్టడి చేస్తే, మాకు అవకాశం కలిసొస్తుందని భావించాం. ఈ పరిస్థితుల గురించి మాకు బాగా తెలుసు. మిడిల్ ఓవర్లలో మేము బాగా ఆడాలి, అదే మా లోపం అని,మా బౌలర్లలో ఎలాంటి లోపం లేదు. వారు బాగా ఆడారు. మైదానంలో 10-15 పరుగులు కాపాడుకోగలిగితే, గేమ్లో తేడా తీసుకురాగలం. ఈ విషయంలో మేము మరింత ఏకాగ్రతతో ఉండాలి. తప్పులు సరిచేసుకుని, మా బ్యాటింగ్ యూనిట్ ధైర్యంగా ఆడాలి. పాజిటివ్ మైండ్సెట్ అవసరం. మిడిల్ ఆర్డర్లో మాకు నాణ్యమైన బ్యాటర్లు ఉన్నారు. వారికి పూర్తి మద్దతు ఇస్తాం. ఆఖర్లో రఘువంశీ బాగా ప్రదర్శన చేశాడు.” అని రహానె చెప్పుకొచ్చాడు.
Read Also:IPL 2025: గుజరాత్ టైటాన్స్ గెలుపు పై స్పందించిన శుభ్మన్ గిల్