జియో బాటలో ఎయిర్‌టెల్ టారిఫ్‌లు భారీగా పెంపు

నిన్న జియో తమ టారిఫ్‌లు పెంచుతున్నట్లు ప్రకటించగా..ఈరోజు ఎయిర్‌టెల్ సైతం టారిఫ్‌లు పెంచుతున్నట్లు ప్రకటించింది. జులై 03, 2024 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. గురువారం, రిలయన్స్ జియో కూడా తన మొబైల్ ప్లాన్‌ రేట్లను 12 శాతం నుంచి 27 వరకు పెంచింది. జియో కొత్త టారిఫ్‌లు కూడా జులై 03, 2024 నుంచి అమల్లోకి వస్తాయి. జులై 02వ తేదీ వరకు ప్రస్తుత రేట్లే అమల్లో ఉంటాయి. రిలయన్స్‌ జియో… తన నెలవారీ (28 రోజులు) ప్లాన్‌లు, 2 నెలల ప్లాన్లు (56 రోజులు), 3 నెలల ప్లాన్లు (84 రోజులు), వార్షిక ప్లాన్ల (335 & 336 రోజులు) మొత్తాన్ని పెంచింది.

28 రోజుల ప్లాన్‌ ధరలను 27 శాతం వరకు, 84 రోజుల ప్లాన్లను 20 శాతం వరకు రిలయన్స్‌ జియో పెంచింది. డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లు, పోస్ట్ పెయిడ్ టారిఫ్‌ రేట్లను సైతం జియో పెంచింది. దీంతో… కొత్త ప్లాన్లు కనిష్టంగా రూ. 189 నుంచి గరిష్టంగా రూ. 3,599 వరకు చేరాయి. ప్రస్తుతం ఇవి కనిష్టంగా రూ. 155 – గరిష్టంగా రూ. 2,999 మధ్యలో ఉన్నాయి. జియో యాడ్‌-ఆన్‌ ప్లాన్ల కొత్త ధరలు కనిష్టంగా రూ. 29 నుంచి గరిష్టంగా రూ. 69 వరకు ఉన్నాయి.

పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్ల విషయానికి వస్తే… ప్రస్తుతం రూ. 299 ప్లాన్‌ జులై 03 నుంచి రూ. 349 అవుతుంది. ప్రస్తుతం రూ. 399గా ఉన్న ప్లాన్‌ కోసం జులై 03 నుంచి రూ. 449 చెల్లించాల్సి వస్తుంది. భారతదేశంలోని టెలికాం కంపెనీలు ఆర్థికంగా బలంగా ఉండాలంటే “ప్రతి వినియోగదారు నుంచి వచ్చే సగటు ఆదాయం” (ARPU) రూ. 300 పైగా ఉండాలని భారతి ఎయిర్‌టెల్ స్టాక్ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు తెలిపింది. ARPUనకు తగ్గట్లుగా వ్యాపార నమూనా ఉండాలని వెల్లడించింది. ARPU రూ. 300 దాటితే… నెట్‌వర్క్ టెక్నాలజీ & స్పెక్ట్రమ్‌ కోసం పెద్ద మొత్తంలో అవసరమయ్యే పెట్టుబడులు అందుబాటులోకి వస్తాయని, మూలధనంపై సాధారణ రాబడిని పొందగమని తాము నమ్ముతున్నట్లు ఎక్సేంజ్‌ పైలింగ్‌లో భారతి ఎయిర్‌టెల్‌ పేర్కొంది. సామాన్య ప్రజల బడ్జెట్‌పై ఎలాంటి భారం లేకుండా, ఎంట్రీ-లెవల్ ప్లాన్‌ రేట్లను చాలా తక్కువ మొత్తంలో (రోజుకు 70 పైసల కంటే తక్కువ) పెంచినట్లు వెల్లడించింది.