న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ బడ్జెట్పై దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తొలిరోజు సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తున్నారు. తొలుత ఇటీవల మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి మన్మోహన్ సేవలను కొనియాడారు. అలాగే, మహాకుంభమేళా తొక్కిసలాటలో మృతిచెందిన భక్తులకు నివాళులర్పించారు. మహాకుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారని అన్నారు. విద్యా రంగంపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు.
డిజిటల్ టెక్నాలజీ రంగంలో ప్రస్తుతం భారత్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ఇండియాలో ఏఐ మిషన్ ప్రారంభమైంది. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రారంభించాం. డిజిటల్ ఇండియాగా దేశాన్ని తీర్చిదిద్దే ప్రక్రియ కొనసాగుతోంది. యూపీఐ లావాదేవీల విధానం చూసి అభివృద్ధి చెందిన దేశాలే ముక్కున వేలేసుకుంటున్నాయి. సామాజిక న్యాయం, సమానత్వానికి మా ప్రభుత్వం డిజిటల్ టెక్నాలజీని ఓ సాధనంగా వినియోగిస్తోంది అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశగా కృషి చేస్తోందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం రూ.12 వేల కోట్లు కేటాయించామని తెలిపారు.

వక్ఫ్ బోర్డ్ సంస్కరణపై దృష్టి సారించిందని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా లక్షలాది మంది పేదల సొంతింటి కల నెరవేరబోతోందని అన్నారు. 3 కోట్ల మంది పేదలకు ఇళ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. బడ్జెట్లో రైతులు, మహిళలు, యువతకు ప్రాధాన్యత ఇస్తున్నాం.. భారతీయుడు అంతరిక్షంలో అడుగుపెట్టే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. ఇటీవలే ఇస్రో 100 వ ప్రయోగం విజయవంతంగా నిర్వహించింది.. అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.. ప్రభుత్వ ఉద్యోగులు కూడా మధ్య తరగతివారే కాబట్టి వారి కోసం 8వ వేతన సంఘాన్ని నియమించినట్టు తెలిపారు. త్వరలోనే భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించబోతోంది.. ఖేలో ఇండియా దేశంలో యువతకు ఎంతో ఉపయోగపడుతోంది.. ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు సత్తాచాటుతున్నారు..వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా అడుగులు పడుతున్నాయి. అని రాష్ట్రపతి తెలిపారు.