ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కడప జిల్లా ప్రత్యేక స్థానం కలిగిన ప్రాంతం. ముఖ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ జీవితానికి పునాదులు కడప నుంచే పడటంతో ఈ జిల్లా వైఎస్సార్ కుటుంబానికి కోటగమనంగా మారింది. కానీ ఇటీవల ఆ రాజకీయ వాతావరణంలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

ఆది నారాయణరెడ్డి రాజకీయ ప్రస్థానం –
ఆది నారాయణరెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేసిన ఆయన, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేరారు. అక్కడినుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ జగన్తో విభేదాలు రావడంతో పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అనంతరం టీడీపీ నుంచి బహిష్కరణ తర్వాత బీజేపీలో చేరి 2019లో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి గెలిచారు. ఈ ప్రయాణం ఆది నారాయణరెడ్డిని రాజకీయంగా అనుభవజ్ఞుడిగా మలిచినా, ఆయనపై విమర్శలు కూడా తక్కువగా లేవు. తాజాగా ఆయన వైసీపీ నేతలపై చేసిన ఆరోపణలు, ప్రత్యేకించి సిమెంట్ ఫ్యాక్టరీలు, కాంట్రాక్టుల వ్యవహారంలో ఆయన పాత్రపై వివాదం తలెత్తింది. అయితే కడప జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీల వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానంగా వైసీపీని తెరపైకి తెచ్చిన ఆదినారాయణరెడ్డి ఇవాళ తన మాటల దాడిని మరింత పెంచారు. వైసీపీ సిమెంట్ ఫ్యాక్టరీల అరాచకాలను తాను అడ్డుకుంటున్నట్లు చెబుతున్న ఆదినారాయణరెడ్డి ఇవాళ మరోసారి ఇదే విషయంపై ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఆయన నేరుగా వార్నింగ్ ఇచ్చారు.
వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు
వైఎస్ జగన్ ను రాజకీయాల్లో లేకుండా చేస్తామంటూ ఆదినారాయణరెడ్డి హెచ్చరించారు. జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదుల కంటే కడపలో ఉన్న వైసీపీ నాయకులే డేంజర్ అని అన్నారు.వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు కూడా రావని వ్యాఖ్యానించడం, జగన్ కోరికలు నెరవేరవని చెప్పడం ఆయన ధోరణిని బహిరంగంగా బయటపెడుతుంది. ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వేడిని పెంచుతున్నాయి. పైగా, ఆయన లిక్కర్ కేసుల్లో వైసీపీ నేతల ప్రమేయంపై ఆరోపణలు చేస్తూ, కేసుల్లో సహా జగన్ పేరు బయటపడుతుందని చెబుతున్నారు. చెట్టే రాలిపోతుంటే ఇక ఆకులు, ఈకలు ఏం ఉంటాయంటూ ఆదినారాయణరెడ్డి వైసీపీపై విమర్శలు గుప్పించారు. కడప నియోజకవర్గ రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆదినారాయణరెడ్డి, అనంతపురం జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబంతో కూడిన ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలను టార్గెట్ చేయడం మరో వివాదానికి దారితీసింది. జేసీ ట్రక్కులపై చర్యలు తీసుకోవడం, ట్రాఫిక్ అడ్డుకోవడం ఈ వివాదాన్ని మరింత వేడెక్కించింది. ఈ విషయం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఇద్దరినీ పిలిచి రాజీ చేయాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత కడప జిల్లాలో సీమెంట్ ఫ్యాక్టరీలను టార్గెట్ చేస్తూ ఆదినారాయణరెడ్డి చేస్తున్న రచ్చపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఇదంతా వైసీపీపై పోరాటమే అంటూ ఆది చెప్పుకుంటున్నారు.
Read also: Terror Attack : ప్రభుత్వ లాంఛనాలతో విశాఖ వాసి చంద్రమౌళి అంత్యక్రియలు పూర్తి