విజయవాడ చేరుకున్న నటి కాదంబరీ జత్వానీ

నటి కాదంబరీ జత్వానీ వ్యవహారం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు ఐపీఎస్‌లు అధికారాన్ని దుర్వినియోగం చేసి తనను వేధించారని ఆమె చేసిన ఆరోపణలను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో నటి జెత్వానీ శుక్రవారం విజయవాడకు వచ్చారు. మధ్యాహ్నం ఆమె పోలీస్ కమిషనర్‌ను కలవనున్నారు. ఏసీపీ స్రవంతిరాయ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం.. జత్వానీ నుంచి వివరాలు తీసుకోనున్నారు.

మరోవైపు, ఆమెపై నమోదు చేసిన ఫోర్జరీ కేసునూ విచారణాధికారి పరిశీలించనున్నారు. ఏపీ పోలీసులు అక్రమ కేసులు పెట్టి తనను అనేక విధాలుగా వేధించారని నటి జెత్వానీ ఆరోపించారు. ఆ అధికారులకు సంబంధించిన అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని.. వీటన్నింటినీ ఏపీ ప్రభుత్వానికి అందిస్తానని చెప్పారు. తన కుటుంబ సభ్యులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని.. ఇప్పుడు సర్కారు తనకు సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కొందరు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.. డబ్బుల కోసమే ఇలా మాట్లాడాతున్నానని తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.