అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించిన ప్రధాన పూజారి ఇకలేరు

జనవరి నెలలో అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ప్రధాన అర్చకులు ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ (86) శనివారం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. వారణాసిలోని మణికర్ణిక ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

వారణాసిలో సీనియర్ పండితులలో ఒకరిగా పేరు పొందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ స్వస్థలం మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా. ఆయన కుటుంబ సభ్యులు కొన్ని తరాలుగా వారణాసిలో నివసిస్తున్నారు. దీంతో లక్ష్మీకాంత్ కూడా వారణాసిలోనే స్థిరపడ్డారు. దీక్షిత్ మృతి పట్ల ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు.