అమరావతీ: ఏపీ ఈరోజు నుండి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ జరుగనుంది. నేటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ జరుగనుంది. సంక్రాంతి పండుగ తర్వాత.. కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా జరుగనుంది. ముఖ్యంగా జగన్ ఫోటోలతో ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా జరుగనుందని సమాచారం. అలాగే.. రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది చంద్రబాబు కూటమి సర్కార్. ఇది ఇలా ఉండగా..డిసెంబర్ 4న జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం 3కి మార్పు జరిగింది. దీంతో ఈనెల 3న అంటే రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. ఇలాంటి తరుణం లోనే.. ఇవాళ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు.
కాగా, రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్కార్డులు మంజూరు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. అదే విధంగా రేషన్కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం కల్పించింది. దీని కోసం ఈ రోజు నుంచి అర్హత ఉన్న వారు గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వివరాలన్నీ పరిశీలించిన తర్వాత అర్హత ఉన్న వారికి సంక్రాంతికి నూతన కార్డులు మంజూరు కానున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రతిపాదిక కావటంతో పథకాల లబ్దిదారులు కొత్త రేషన్ కార్డుల కోసం ముందుకొస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాలు అందాలంటే గా బియ్యం కార్డు కలిగి ఉండాలి.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి చేసారు. గత ప్రభుత్వ హయాంలో కొత్త కార్డుల ప్రక్రియ పూర్తి చేయలేదు. కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం దక్కలేదు. దీంతో, మార్పులు.. కొత్తగా పెళ్లైన వారికి కార్డులు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు ప్రభుత్వం అవకాశం ఇవ్వటంతో బియ్యం కార్డుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సచివాలయాలతో పాటుగా ఏపీ పౌర సరఫరాల శాఖ అధికారిక వెబ్సైట్లో కూడా డిసెంబర్ 28వ తేదీ వరకూ రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం కల్పించారు.