ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరో తొమ్మిది రోజులే సమయం ఉండటంతో అధికార, విపక్ష పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇక అధికార ఆమ్ ఆద్మీ పార్టీ రెండో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇప్పటికే మధ్యతరగతి ప్రజల కోసం ఆప్ మేనిఫెస్టో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా 15 గ్యారెంటీలతో ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సోమవారం కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేశారు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో సంక్షేమ పథకాలు, ఉపాధి కల్పన, ప్రజాసేవల్లో మెరుగుదల వంటి 15 కీలక వాగ్దానాలు చేశారు. ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలను కొనసాగిస్తామని వెల్లడించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. మెట్రో ఛార్జీల్లో 50శాతం రాయితీ ఇస్తామని హమీ ఇచ్చారు.

AAP 15 పోల్ గ్యారెంటీలు ఇవే..
ఉపాధి హామీ
ప్రతి మహిళకు రూ.2,100.. నేరుగా బ్యాంకు ఖాతాకే నగదు జమ
సంజీవని యోజన పథకం కింద 60 ఏళ్లు పైబడిన వారికి ఉచిత చికిత్స (ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య చికిత్స, నీటి బిల్లుల మాఫీ, 24 గంటల నీటి సరఫరా, యూరప్ తరహాలో రోడ్లు
యమునా నదిని శుభ్రం చేస్తాం, డాక్టర్ అంబేద్కర్ స్కాలర్షిప్ పథకం, విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం, ఢిల్లీ మెట్రోలో 50 శాతం రాయితీ, అర్చకులు, గ్రంథులకు ఒక్కొక్కరికి రూ.18వేలు
కౌలుదారులకు ఉచిత విద్యుత్, నీరు, మురుగునీటి వ్యవస్థలను మెరుగుపరచటం
రేషన్ కార్డుల మంజూరు, ఆటో, టాక్సీ , ఇ-రిక్షా డ్రైవర్లకు జీవిత బీమా, వారి కుమార్తె వివాహానికి రూ. 1 లక్ష సాయం, పిల్లలకు ఉచిత కోచింగ్, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్కు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు.
కేంద్రానికి కేజ్రీవాల్ ఏడు డిమాండ్లు
కేంద్ర ప్రభుత్వం త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మధ్యతరగతి ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి అరవింద్ కేజ్రీవాల్ ఏడు డిమాండ్లు లేవనెత్తారు. ‘విద్యా బడ్జెట్ను రెండు నుంచి పది శాతానికి పెంచాలి, ప్రైవేట్ పాఠశాలల ఫీజులను నియంత్రించాలి. మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండేలా ఉన్నత విద్యకు సబ్సిడీలు, స్కాలర్షిప్లు ఇవ్వాలి. ఆరోగ్య బడ్జెట్ను పది శాతానికి పెంచాలి, ఆరోగ్య బీమాపై పన్ను తొలగించాలి వంటివి.