తెలంగాణ మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ (BRS) పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఓటమికి కారణం కల్వకుంట్ల కవిత అని ఆరోపించారు. కేజ్రీవాల్ ప్రభుత్వంతో కలిసి లిక్కర్ స్కామ్ చేసినందువల్లే ఆప్ పరాజయం పాలైందని ఆమె విమర్శించారు.

బిఆర్ఎస్ పార్టీ ఎక్కడికి వెళ్లినా, ఏ పార్టీతో కలిసినా ఆ పార్టీకి రాజకీయంగా నష్టం తప్పదని ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మరోసారి నిరూపించాయని సురేఖ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలు, లిక్కర్ స్కామ్ వివాదం ఆప్ పరాజయానికి ప్రధాన కారణమని ఆమె స్పష్టం చేశారు. ఢిల్లీ ఫలితాల నేపథ్యంలో రాహుల్ గాంధీపై KTR చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అహంకారంతో నిండిపోయాయని కొండా సురేఖ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అహంకారానికి స్థానం లేదని, అలాంటి దురహంకారాన్ని ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు.
బిఆర్ఎస్ పార్టీపై ప్రజలు ఇప్పటికే అసంతృప్తిగా ఉన్నారని, ఈ పార్టీ ఇక రాజకీయంగా నిలబడలేదని కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు BRS పార్టీని తిరస్కరించడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. బిఆర్ఎస్ అధినాయకత్వం ఇప్పటికైనా ప్రజల తీర్పును గౌరవించి, తమ తప్పులను అంగీకరించి మారాలని సూచించారు. లేకపోతే, మరిన్ని ఎన్నికల్లో ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు.