ఆయనలోని మనో నిబ్బరం ఇసుమంతైనా చెదిరిపోలేదుః సిసోడియా భార్య

103 రోజుల తర్వాత మనీశ్ సిసోడియాను కలిసిన భార్య సీమా భావోద్వేగం

AAP leader Sisodia wife shares heartfelt note as they meet after 103 days

న్యూఢిల్లీః మద్యం కుంభకోణం ఆరోపణలపై మూడు నెలలుగా తీహార్ జైలులో ఉంటున్న ఆప్ నేత, మాజీ మంత్రి మనీశ్ సిసోడియాను నిన్న ఆమె భార్య సీమా కలిశారు. బెయిలు కోసం సిసోడియా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో ఉన్న సీమాను, ఇతర కుటుంబ సభ్యులను వారి ఇంట్లోనే కలిసేందుకు ఢిల్లీ హైకోర్టు గత వారం మనీశ్‌కు అనుమతినిచ్చింది. దీంతో ఇంటికొచ్చిన ఆయన దాదాపు ఏడు గంటలపాటు కుటుంబ సభ్యులతో గడిపారు.

అనంతరం సీమా ఓ ట్వీట్ చేస్తూ.. రాజకీయ క్రీడలో జైలు పాలైన తన భర్తను 103 రోజుల తర్వాత చూశానని పేర్కొన్నారు. ఇన్నాళ్లూ ఆయన నేల మీదే పడుకున్నారని, విపరీతమైన వేడితోపాటు దోమల బాధతో ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా సరే ఆశయ సాధన కోసం అదే నిశ్చలత్వంతో ఉన్నారని పేర్కొన్నారు. ఆయనలోని మనో నిబ్బరం ఇసుమంతైనా చెదిరిపోలేదని సీమా ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.