ఆస్ట్రియాలో ప్రధాని మోడీకి ఘనస్వాగతం

A warm welcome to PM Modi in Austria

వియన్నా : ప్రధాని నరేంద్ర మోడీ మూడ్రోజుల విదేశీ పర్యటన కొనసాగుతోంది. సోమ, మంగళవారాల్లో రష్యాలో పర్యటించిన ఆయన నేడు ఆస్ట్రియాలో పర్యటిస్తున్నారు. రష్యా పర్యటన ముగించుకొని ఆస్ట్రియా రాజధాని వియన్నా చేరుకున్న మోడీకి ఆస్ట్రియా విదేశాంగ మంత్రి అలెగ్జాండర్‌ చెలెన్‌బర్గ్‌ ఘన స్వాగతం పలికారు. తర్వాత ఆస్ట్రియా ఛాన్స్‌లర్‌ కార్ల్‌ నెహమార్‌ ఇచ్చిన ప్రైవేటు విందుకు హాజరయ్యారు.

ద్వైపాక్షిక బంధం బలోపేతమే లక్ష్యంగా ఇరువురు నేతలు చర్చలు జరిపినట్లు విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. రెండు దేశాలు ఎదుర్కొంటున్న బౌగోళిక సవాళ్లను ఎదుర్కొనే విషయంలో పరస్పరం కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు వివరించారు. ఈ సందర్భంగా మోడీ, నెహమార్సె ల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటో కూడా సోషళ్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరోవైపు ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్‌ వాన్‌డెర్‌ బెల్లెన్‌తో మోడీ సమావేశం కానున్నారు. 1983 తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడం ఇదే తొలిసారి. అప్పట్లో ఇందిరాగాంధీ ఆస్ట్రియా పర్యటనకు వెళ్లారు. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని మోడీ ఆస్ట్రియా పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.