సంక్రాంతి పండుగ తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ పండుగ ఉత్సవాల్లో కోనసీమ ప్రభల తీర్దానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామంలోని జగ్గన్నతోటలో జరుగు ఏకాదశ రుద్రప్రభల తీర్దం దాదాపు నాలుగు వందల ఏళ్ల చరిత్రను కలిగి ఉంది. సంక్రాంతి పండుగకు సంబంధించిన ఈ వైభవం హిందూ సంప్రదాయాలను, పురాణ గాథలను ప్రతిబింబిస్తోంది.
తాజాగా జగ్గన్నతోటలో జరిగే ఈ ప్రభల తీర్దానికి కేంద్ర పర్యాటక శాఖ ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. ఈ తీరును దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తేనుకు కేంద్రం సహకరించనుంది. ‘ఉత్సవ్’ విభాగంలో ఈ కార్యక్రమానికి స్థానం దక్కడం ప్రభల ఉత్సవాలకు ప్రతిష్టను తీసుకొచ్చింది. ఈ గుర్తింపు పట్ల గంగలకుర్రు అగ్రహారానికి చెందిన శివకేశవ యూత్ ఆనందం వ్యక్తం చేశారు. మకర సంక్రాంతి తర్వాత వచ్చే ఉత్తరాయణ కాలంలో జరిగే ఈ ప్రభల ఉత్సవం భక్తులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. ఎగువ కౌశిక దాటుతూ ప్రభలు పొలిమేరల మీదుగా వెళ్లే తీరు భక్తులను ఆకట్టుకుంటుంది. ఇది పవిత్రమైన సమాగమంగా భావించబడుతుంది. ఈ తీర్థం భక్తుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందనే విశ్వాసం ఉంది.
జగ్గన్నతోట ఏకాదశ రుద్రుల సమాగమానికి ఎంతో చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది. ప్రాచీనకాలంలో 11 గ్రామాల రుద్రులు ఇక్కడే ఒకే తోటలో సమావేశమయ్యారనే ప్రతీతి ఉంది. గుడులు, గోపురాలు లేకుండా, ప్రకృతిలో పూర్తిగా కొబ్బరితోటలో జరిపే ఈ సమాగమం ప్రత్యేకమైనది. వేదసీమ అయిన కోనసీమలో ఏకాదశ రుద్రులు సమావేశం కావడం, ఈ తోటకు ఉన్న ప్రాముఖ్యతను చాటిచెబుతోంది. 2023 గణతంత్ర వేడుకల్లో ఏకాదశ రుద్రప్రభల నమూనాను ఏపీ శకటంగా ప్రదర్శించడం, ఈ ఉత్సవాలకు మరింత ప్రతిష్టను తీసుకువచ్చింది. హిందూ సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పే ఈ పండుగకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన గుర్తింపు తెలుగు సంస్కృతికి మరో పుంత వేస్తోంది. జగ్గన్నతోట ప్రభల తీర్దం వైభవం అనేక తరాల నుంచి కొనసాగుతూ, భవిష్యత్ తరాలకూ దిశానిర్దేశం చేస్తోంది.