పెళ్లైన గంటల్లోనే తిరిగిరాని లోకానికి వెళ్లిన ప్రేమ జంట

కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు..పెద్దల సమక్షంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొని , పెద్దలను ఒప్పించి..ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొద్దీ గంటల్లోనే ఇరువురు ఘర్షణ పడి తనువుచాలించారు. ఈ ఘటన కర్ణాటకలో ఉన్న కేజీఎఫ్ లోని చంబరసనహళ్లిలో జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని సంతూరుకు చెందిన నవీన్ (26), కర్ణాటకలోని కోలూరు జిల్లా కేజీఎఫ్ తాలూకా బైనేహళ్లికి చెందిన లిఖిత (22) కొంత కాలం ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించడంతో ఇరు కుటుంబాల బంధు మిత్రుల సమక్షంలో ఈ నెల 7వ తేదీ (బుధవారం)న కేజీఎఫ్ పట్టణంలోని కల్యాణ మండపంలో ఇద్దరూ ఒక్కటయ్యారు. అనంతరం తమ బంధువులతో నూతన దంపతులు కొద్దిసేపు సరదాగా గడిపారు.

ఆ సాయంత్రం లిఖితతో పాటు ఆమె తల్లిదండ్రులను అదే గ్రామంలో ఉన్న తన బంధువులను నవీన్ తన ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ ఓ గదిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో నూతన దంపతులు ఘర్షణ పడ్డారు. ఆ వివాదం తీవ్ర స్థాయికి చేరడంతో లిఖితపై నవీన్ కత్తితో దాడి చేశాడు. గదిలో నుంచి పెద్దగా అరుపులు వినపడడంతో కుటుంబ సభ్యులు తలుపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్లి చూసి నిర్ఘాంతపోయారు. లిఖిత అప్పటికే రక్తపు మడుగులో పడి మృతి చెందగా నవీన్ కూడా తీవ్ర గాయాలపాలై పడి ఉన్నాడు.

వెంటనే కుటుంబ సభ్యులు నవీన్‌ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం అతడు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేరే యువకుడితో లిఖిత వాట్సాప్ చాట్ చేయడంతోనే ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు.