టైమ్స్ టవర్లో భారీ అగ్ని ప్రమాదం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు
ముంబయి : ముంబయి లోని టైమ్స్ టవర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు లోయర్ పరేల్ ప్రాంతంలో ఉన్న టైమ్స్ టవర్స్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పై అంతస్తులకు వ్యాపించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 9 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా, ఇప్పటివరకు ఎవరికి గాయాలవలేదని తెలుస్తున్నది.
కమల మిల్ కాంపౌండ్లో ఉన్న ఈ ఏడు అంతస్తుల వాణిజ్య సముదాయంలో మంటలు అంటుకున్నట్లు తమకు ఉదయం 6.30 గంటలకు సమాచారం అందిందని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. మంటలను అదుపుచేసేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారని తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని బృహిన్ ముంబై కార్పొరేషన్ (BMC) తెలిపింది. కాగా, టైమ్స్ టవర్ ముంబైలో చాలా రద్దీగా ఉండే ప్రాంతంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.