అమెరికాకు స్వర్ణయుగం మొదలైందని, తమ దేశ సైన్యాన్ని ప్రపంచంలో ఎవరూ ఊహించలేని విధంగా పునర్నిర్మాణం చేస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తన ప్రమాణస్వీకారం అనంతరం మాట్లాడిన ఆయన “చైనా ఆధీనంలోని పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటాం. శత్రువులపై పోరాడటమే అమెరికా దళాల ప్రధాన లక్ష్యంగా ఉండబోతుంది. గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చడం కోసం చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.
అమెరికాలో ధరలను తగ్గించి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ట్రంప్ పేర్కొన్నారు. ప్రజల జీవనస్థాయిని మెరుగుపరచడం కోసం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా నిత్యావసరాల ధరలను సాధారణ స్థాయికి తీసుకురావడం ద్వారా సామాన్య ప్రజలకు ఆర్థిక సంతోషం కల్పించనున్నట్లు చెప్పారు.
అమెరికా భూభాగంపై తీవ్రవాద కార్యకలాపాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. “నేర గ్యాంగ్స్పై కఠినంగా వ్యవహరిస్తాం. ప్రజల భద్రత మా ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ముందడుగు వేస్తాం” అని ట్రంప్ చెప్పారు. అలాగే, “అమెరికన్ డ్రీమ్ ప్రతి ప్రతిభావంతుని కలగా మిగలాలి. అందుకు మా ప్రభుత్వం ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో వివక్ష చూపదు” అని పేర్కొన్నారు. ప్రపంచంలో శాంతి నెలకొల్పడం కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. “గాజాలో బందీల విడుదల సంతోషకరమైన పరిణామం. ఈ తరహా చర్యలు శాంతిని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాయి” అని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా ప్రజల జీవనోన్నతికి మాత్రమే కాకుండా, ప్రపంచ శాంతికి తమ ప్రభుత్వం అంకితమై ఉంటుందని చెప్పారు.
ఇక డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. “నా మిత్రుడు డొనాల్డ్ ట్రంప్కు శుభాకాంక్షలు. అధ్యక్షుడిగా మీ పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షిస్తున్నాను. ఇరు దేశాల ప్రయోజనం కోసం కలిసి పని చేసేందుకు నేను ఎదురుచూస్తున్నాను” అని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు.