అంగన్వాడీలో మెనూపై ఓ చిన్నారి కోరిక రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించింది. రాష్ట్ర వ్యాప్తంగా మార్పులకు నాంది కాబోతోంది. ఆ చిన్నారి మాటలకు మంత్రి స్పందించి తగు చర్యలు ఆదేశించడానికి కారణమైంది. ఉప్మాకు బదులుగా బిర్యానీ, చికెన్ ఫ్రై కావాలని అమాయకంగా అడుగుతోన్న ఓ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి ఏకంగా ప్రభుత్వ పెద్దలనే ఆలోచనలో పడేసింది. దీంతో కేరళలోని చిన్నారుల సంరక్షణ కేంద్రాల మెనూలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు కేరళ ఆరోగ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి వీణా జార్జ్ స్పందించారు. వైరల్ అవుతోన్న వీడియోలో టోపీ ధరించిన త్రాజుల్ ఎస్ శంకర్(శంకు) అనే బాలుడు ఇంటి వద్ద చేసిన బిర్యానీ తింటూ అమాయకంగా తన తల్లిని.. ‘నాకు అంగన్వాడీలో ఉప్మాకు బదులుగా బిర్నానీ (బిర్యానీ) పోరిచా కోజి (చికెన్ ఫ్రై) కావాలి’ అని అడగటం వినిపిస్తోంది. బుజ్జిబుజ్జి మాటలకు మురిసిపోయిన తల్లి.. దానిని వీడియో తీశారు.

ఆ వీడియో తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది మంత్రి వీణ జార్జ్ దృష్టిలో పండింది. దీంతో ఆమె తన ఫేస్బుక్ పేజ్లో ఆ వీడియోను షేర్ చేశారు. ఆ చిన్నారి అమాయకంగా చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు ఆమె చెప్పారు. అంతేకాదు, మెనూను సమీక్షిస్తామని తెలిపారు. ఇక, ఆ చిన్నారి వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బాలుడికి మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే స్వయంగా తామే బిర్యానీ పంపుతామని ఆఫర్ ఇస్తున్నారు. అంతేకాదు, జైళ్లలో ఖైదీలకు అందించే ఆహారాన్ని తగ్గించాలని, అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు మెరుగైన పోషకాహారం అందించాలని మరి కొందరు సూచించారు. ఈ నేపథ్యంలో మంత్రి వెంటనే స్పందించి, మెనూపై రివ్యూ చేయాలని ఆదేశాలు జారీ చేయడాన్ని ప్రశంసిస్తున్నారు.