భారత్లో కొత్తగా 96,424 పాజిటివ్ కేసులు
52 లక్షలు దాటిన మొత్తం కేసుల సంఖ్య
న్యూఢిల్లీ: భారత్లో కొత్తగా 96,424 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 52,14,678కు చేరాయి. ఇందులో 10,17,754 కేసులు యాక్టివ్గా ఉండగా, కరోనా బారినపడినవారిలో మరో 41,12,552 మంది కోలుకుని ఇంటికి చేరారు. నిన్న ఉదయం నుంచి నేటి ఉదయం వరకు కరోనాతో కొత్తగా 1174 మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు 84,372 మంది బాధితులు చనిపోయారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.
మొత్తం యాక్టివ్ కేసుల్లో 60 శాతం కేసులు ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నాయని తెలిపింది. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 5 వేలలోపే యాక్టివ్ కేసులు ఉన్నాయని ప్రకటించింది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే 49 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయని వెల్లడించింది. అయితే మరణాల రేటు ఒక శాతం తగ్గి ప్రస్తుతం 1.64 శాతంగా ఉందని పేర్కొంది. దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 10,06,615 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. దీంతో సెప్టెంబర్ 17 నాటికి 6,15,72,343 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/