న్యూయార్క్ : అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించిన హష్ మనీ కేసులో న్యూయార్క్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో ట్రంప్ దోషిగా తేలినా, ఆయనకు అన్కండిషనల్ డిశ్చార్జ్ చేసింది. ఆయనకు న్యాయమూర్తి ఎటువంటి జైలు శిక్ష లేదా జరిమానా విధించలేదు. అయితే, దోషిగా నిర్ధారించబడిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలో నిలవనున్నారు.
హష్ మనీ కేసుకు సంబంధించి న్యూయార్క్ కోర్టు జడ్జి జువాన్ ఎం.మెర్చన్ తీర్పు వెలువరించగా, వర్చువల్గా విచారణలో పాల్గొన్న ట్రంప్ తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఈ కేసు తనపై రాజకీయ దాడిగా భావిస్తున్నానని, ఇది తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు చేసిన కుట్ర మాత్రమేనని ఆరోపించారు. అంతేకాక, తనకు లక్షలాది పాపులర్ ఓట్లు వచ్చాయని, అమెరికా ప్రజలు తనకు మద్దతు ఇచ్చారని చెప్పుకొచ్చారు.
2016 ఎన్నికల సమయంలో, శృంగార తార స్టార్మీ డానియల్స్తో తన వ్యక్తిగత సంబంధాలపై ఆమె నోరు విప్పకుండా ఉండేందుకు ట్రంప్ తన న్యాయవాది ద్వారా $1.30 లక్షల హష్ మనీ చెల్లించారని ఆరోపణలు వచ్చాయి. తన వ్యాపార, ఎన్నికల ప్రచార నిధులను దుర్వినియోగం చేసి, ఆ రికార్డులను తారుమారు చేశారని ట్రంప్ పై ప్రధాన అభియోగం. 34 అంశాల్లో నేరారోపణలు ఎదుర్కొన్న ట్రంప్పై ఆరు వారాల విచారణ అనంతరం 12 మంది సభ్యులతో కూడిన ధర్మాసనం ఆయనను దోషిగా తేల్చింది. కోర్టు విచారణలో స్టార్మీ డానియల్స్ సహా 22 మంది సాక్షులను పరిశీలించింది. ట్రంప్తో సంబంధాల గురించి స్టార్మీ డానియల్స్ కోర్టులో తన వాంగ్మూలం ఇచ్చింది.
హష్ మనీ కేసులో డొనాల్డ్ ట్రంప్కు ఏ శిక్ష విధిస్తారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగింది. న్యాయ నిపుణుల ప్రకారం, ట్రంప్కు జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే, ఇంతకు ముందు ఇలాంటి కేసుల్లో ఎక్కువగా జరిమానానే విధించబడిందని, ఈసారి కూడా ట్రంప్కు జరిమానాతోనే శిక్ష ముగిసే అవకాశం ఉందని చాలామంది భావించారు. అయితే, న్యూయార్క్ కోర్టు జడ్జి జువాన్ మర్చెన్ ఈ కేసు గురించి కొన్ని రోజుల ముందు స్పందిస్తూ, ట్రంప్ వంటి వ్యక్తులకు జరిమానా విధించడం సరిపోదని, జైలు శిక్షే విధించాల్సిందిగా అభిప్రాయపడ్డారు.