నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన చిత్రం డాకు మహారాజ్. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదిన ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ మొదటగా ఏపీలో జరగాల్సి ఉంది. తిరుమల తొక్కిసలాటలో 6 మంది మృతి చెందిన కారణంగా ఈవెంట్ వాయిదా పడింది. ఆ వేదికను నిర్మాత హైదరాబాద్కు మార్చారు.
ఇక ఈ ఈవెంట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ..’అఖండ 2′ మూవీ తర్వాత ఇండస్ట్రీకి తన విశ్వరూపం చూపిస్తానని సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆ తర్వాత వచ్చే సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయని చెప్పారు. ‘మా నాన్న, అభిమానులే నాకు ఇన్స్పిరేషన్. వారిచ్చిన ప్రోత్సాహంతోనే ఇలాంటి సినిమాలు చేస్తున్నా. సంక్రాంతికి రాబోయే ఈ సినిమా బ్లాక్బస్టర్గా నిలుస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. సినిమా కలెక్షన్లు, స్టార్ డమ్ వంటి వాటిని తాను పట్టించుకోనని బాలకృష్ణ అన్నారు. ఏం చూసి ఇంత పొగరు అని చాలా మంది అనుకుంటారని, తానే తన పొగరు, ధైర్యమని ఈవెంట్లో వెల్లడించారు. తన నమ్మకం, ఆలోచనలే ధైర్యమని, ఎవరితో పోల్చుకోనని స్పష్టం చేశారు. తన రూటే వేరని, మాట సూటిగా, బాట ముక్కు సూటిగా ఉంటుందన్నారు. ఒకరి కీర్తిని తాను మోయనని, తనను తాను మలుచుకున్న మహారాజ్ అని స్పీచ్ ఇచ్చారు. ఇక ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు.