న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం ఎన్నికల కమిషన్ (ఇసి) నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుండి నామినేషన్ల స్వీకరించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 17వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరిస్తారని తెలిపింది. 18న నామినేషన్ల పరిశీలన, ఈ నెల 20 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది. 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగనుంది. 8వ తేదీన కౌంటింగ్ చేపట్టనున్నారు.
ఢిల్లీలో మొత్తం 1.55 కోట్ల ఓటర్లు ఉన్నారని, వీరిలో 83.49 లక్షల పురుష ఓటర్లు, 71.74 లక్షల మహిళా ఓటర్లు ఉన్నారని ఇసి వెల్లడించింది. 25.89 లక్షల మంది యువ ఓటర్లు ఉన్నట్లు తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం 13,033 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే ఆప్ పూర్తి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 29 మంది అభ్యర్థులతో బిజెపి తొలి జాబితా విడుదల చేసింది. మిగిలిన 41స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి వుంది.