ఏపీలో ఎన్నికల్లో ఎన్నో వాగ్దనాలు చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఒకొక్క వాగ్దనాలను అమలుపరుస్తూ వస్తున్నది. కాగా పెన్షన్లు తీసుకునేవారికి పెద్ద షాక్ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేసిన అతి పెద్ద హామీ పెన్షన్ల పెంపు. రాష్ట్రంలో అప్పటికే ఉన్న దాదాపు 65 లక్షల ఆసరా పెన్షన్ల మొత్తాన్ని పెంచిన సీఎం చంద్రబాబు.. అదే సమయంలో అనర్హులను తేల్చాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు కొంతకాలంగా క్షేత్రస్ధాయిలో పరిశీలలన చేస్తూ ఏరివేతలు చేపడుతున్నారు. ఇందులో ఓ కేటగిరిలో మాత్రం ఏకంగా 70 శాతం మంది లబ్దిదారుల్ని తొలగిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్లతో పాటు దివ్యాంగులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మంచం మీదే ఉండిపోతున్న వారికి కూడా వివిధ కేటగిరీల్లో వీటిని పంపిణీ చేస్తున్నారు. ఇలా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మంచానికే పరిమితమైన 24 వేల మందికి నెలకు రూ.15 వేల చొప్పున పెన్షన్ ఇస్తున్నారు. ఇందులో కేవలం 20-30 శాతం మంది మాత్రమే అర్హులైన లబ్దిదారులుగా తేల్చారు.
మరో 40-50 శాతం మంది వైకల్యంతో బాధపడుతున్నా ఇలా రూ.15 వేల పెన్షన్ కు మాత్రం అర్హులు కాదని తేలింది. అలాగే మరో 25-30 శాతం మంది అసలు ఏమాత్రం ఈ పథకానికి అర్హులు కాదని తేల్చారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మంచానికే పరిమితమైన 24 వేల మందికి పెన్షన్ల చెల్లింపుకు ప్రభుత్వానికి నెలకు రూ.36 కోట్లు ఖర్చవుతోంది. వీరిని తొలగిస్తే నెలకు రూ.10.84 కోట్లు, ఏడాదికి రూ.130 కోట్లు ఆదా అవుతాయని అంచనా. అలాగే అసలు అర్హులు కాని 25 శాతం మందిని తొలగిస్తే నెలకు మరో 9 కోట్ల చొప్పున ఏడాదికి రూ.108 కోట్లు ఆదా అవుతాయి. ఈ లెక్కన వీరందరినీ తొలగిస్తే మొత్తంగా ఏడాదికి రూ.238 కోట్లు ప్రభుత్వానికి మిగులుతాయి.