బుధువారం తిరుపతి లో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నారా లోకేష్ ల పర్యటన లు రద్దు అయ్యాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పర్యటన కు వెళ్లాల్సి ఉండగా దానిని రద్దు చేసుకున్నారు. ఈ పర్యటనలో ఆయన గ్రీన్ కో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టును పరిశీలించాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ పర్యటనను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
తిరుమల ఘటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చర్చల కారణంగా పవన్ కళ్యాణ్ పర్యటనను రద్దు చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రాజెక్టు పరిశీలన కార్యక్రమం పవన్ కళ్యాణ్ పర్యటనలో ప్రధాన కార్యక్రమంగా ఉండేది. ప్రజల సమస్యలు, ప్రస్తుత పరిస్థితులపై దృష్టి పెట్టే అవసరం ఉందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అటు మంత్రి నారా లోకేశ్ కూడా తన కర్నూలు పర్యటనను రద్దు చేసుకున్నారు. లోకేశ్ ఇవాళ కర్నూలు జిల్లాలో పలు కళాశాలలను సందర్శించాల్సి ఉంది. అదేవిధంగా మంత్రి భరత్ కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకల్లో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ, అనివార్య కారణాల వల్ల ఈ పర్యటన రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు పర్యటనల రద్దు ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రభావం చూపించినప్పటికీ, తిరుమల ఘటన అనంతర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ప్రజలు ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని అధికార ప్రతినిధులు తెలిపారు.