రైతులు బాగుంటేనే మనం కూడా బాగుంటం. అందుకే ప్రభుత్వాలు రైతులకు పలు పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా కొత్త లబ్దిదారులకు ‘రైతు గుర్తింపు ఐడీ’ తప్పనిసరిగా చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. ‘పీఎం కిసాన్ సమ్మాన్’ పథకం కింద దేశవ్యాప్తంగా రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇకపై ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే నూతన లబ్దిదారులు ‘రైతు గుర్తింపు ఐడీ’ని పొందడం తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతు గుర్తింపు ఐడీ పొందిన లబ్దిదారుల పేర్లను మాత్రమే స్కీమ్లో నమోదు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ నిర్ణయించింది.
కేంద్రం ఈ కీలక నిర్ణయం
పీఎం కిసాన్ సమ్మాన్ పథకానికి నెలకు సగటున 2 లక్షల దరఖాస్తులు వస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రైతు గుర్తింపు ఐడీ ఉంటే దరఖాస్తు చేసుకున్న రైతుకు సొంత భూమి ఉందా? లేదా? అనేది తెలుస్తుందని, పథకానికి దరఖాస్తు చేసుకోవడం కూడా సులభంగా మారిపోతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం ‘ఫార్మర్స్ రిజిస్ట్రీ’లో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని, దరఖాస్తు ఫామ్లో రైతు గుర్తింపు ఐడీని ఇవ్వాల్సి ఉంటుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. కొత్త లబ్దిదారులకు తప్పనిసరి అయిన ఈ విధానం ఇప్పటికే 10 రాష్ట్రాల్లో 2025 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిందని తెలిపారు. నిజమైన రైతుల గుర్తింపు, మరిన్ని రైతు సంక్షేమ పథకాలను వర్తింపజేసేందుకు గుర్తింపు ఐడీ చాలా ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.