Headlines
womandies ttd

పెను విషాదం : తిరుపతి తొక్కిసలాటకు కారణమిదే..

తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం పోటెత్తిన భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాట పెను విషాదాన్ని మిగిల్చింది. పద్మావతి పార్క్ వద్ద భక్తులు టోకెన్ల కోసం వేచి ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది గాయపడ్డారు. ఈ ఘటన భక్తుల ఆందోళనను మరింత పెంచింది. ఒక మహిళ అస్వస్థతకు గురికావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు గేటు తెరిచారు. అయితే, టోకెన్లు ఇచ్చేందుకు గేటు తెరిచారని అనుకున్న భక్తులు ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చారు. దీంతో పరిస్థితి అదుపుతప్పి తొక్కిసలాట జరిగింది. క్యూలైన్ వద్ద భక్తుల ఒత్తిడి పెరగడంతో ఈ దుర్ఘటనకు దారితీసింది.

ఈ ఘటనకు సిబ్బంది తీరే కారణమని భక్తులు మండిపడుతున్నారు. క్యూలైన్ వద్ద సిబ్బంది చేసిన ఓవరాక్షన్ వల్ల భక్తులు మరింత ఆందోళనకు గురై ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తున్నారు. భక్తుల నిర్వహణలో జరిగిన లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని వారు భావిస్తున్నారు. ఈ దుర్ఘటనపై ప్రభుత్వం తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తోంది. ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు ఇచ్చారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. భక్తుల భద్రత కోసం మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

భక్తులు అధిక సంఖ్యలో స్వామి దర్శనానికి వస్తున్న సమయంలో క్యూలైన్లలో శాంతంగా ఉండాలని, సిబ్బంది సూచనలు పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వంతో పాటు భక్తుల నుండి సహకారం అవసరమని అధికారులు చెప్పారు. భక్తుల భద్రతే తమ ప్రాధాన్యత అని తి.తి.దే స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *