అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రతలో భారీ మార్పులు చేశారు. ఇటీవల కాలంలో చంద్రబాబుకు మావోయిస్టుల నుంచి ముప్పు పెరగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ మార్పులు చేర్పులు చేశారు. మావోయిస్టులను సైతం ఎదుర్కొనే విధంగా సీఎం సెక్యూరిటీ వలయంలోకి కౌంటర్ యాక్షన్ టీం ను చేర్చుకున్నారు. ప్రస్తుతం ఉన్న NSG, SSG స్థానిక సాయుధ బలగాలకు అదనంగా మరో ఆరుగురు కమాండలతో ఈ కౌంటర్ యాక్షన్ టీం సీఎం చంద్రబాబుకు భద్రత ఇవ్వనున్నది.
ఈ కౌంటర్ యాక్షన్ టీంకు ఎస్పీజీ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తారు. అయితే గతంలో సీఎం చంద్రబాబు నాయుడు పై జరిగిన దాడుల నేపథ్యంలో y+ కేటగిరి సెక్యూరిటీ కాస్త 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జెడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా కౌంటర్ యాక్సిడెంట్ కూడా సీఎం భద్రత వలయంలోకి రానుంది. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు భద్రత ఇకపై కట్టుదిక్కంగా మారింది.
కాగా, దేశంలో బ్లాక్ క్యాట్ కమాండోలు, ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్న అతికొద్ది మంది వ్యక్తుల్లో చంద్రబాబు ఒకరు. తిరుపతిలోని అలిపిరి వద్ద ఆయనపై నక్సల్స్ దాడి చేసిన తర్వాత ఆయనకు ఎన్ఎస్జీ బ్లాక్ క్యాట్ కమాండోలు వచ్చారు. ఈ బ్లాక్ క్యాట్ కమాండోలతో పాటు చంద్రబాబుకు భద్రతా వలయం కూడా ఎప్పుడూ కూడా కట్టుదిట్టంగా ఉంటుంది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు పలు మార్లు దాడులు జరిగిన సమయంలో కూడా ఎన్ఎస్జీ కమాండోల సంఖ్యను పెంచారు. ముందు ఆరుగురు కమాండోలు ఉండగా.. చంద్రబాబు బయటకు వెళ్లే సమయంలో ఆ సంఖ్యను 12కు చేశారు. వీరు నిత్యం కంటికిరెప్పలా చంద్రబాబును కాపాడుతూ ఉండేవారు. అయితే ఇప్పుడు నక్సల్స్ ప్రభావం పెరిగిన నేపథ్యంలో కౌంటర్ యాక్షన్ టీంను రంగంలోకి దింపారు.