డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రూపొందించిన అద్భుతమైన క్రైమ్ డ్రామాల్లో సత్య ఒకటి. ముంబై మాఫియా అండర్ వరల్డ్ నేపథ్యంలో నడిచే ఈ చిత్రం 1998లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. జేడీ చక్రవర్తి, మనోజ్ బాజ్పేయ్, ఊర్మిళ మతోంద్కర్, పరేశ్ రావల్ వంటి నటీనటులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం అప్పట్లో భారీ వసూళ్లను రాబట్టింది.ఇటీవల టాలీవుడ్లో రీరిలీజ్ ట్రెండ్ పెద్ద హిట్ అయ్యింది. పాత సూపర్ హిట్ చిత్రాలను 4K వెర్షన్లో మళ్లీ థియేటర్లలో విడుదల చేస్తూ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల హిట్ సినిమాలు తిరిగి విడుదలై విజయవంతమయ్యాయి.
ఈ క్రమంలో ఇప్పుడు మరో సూపర్ హిట్ చిత్రం సత్య మళ్లీ థియేటర్లకు రాబోతోంది.రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సత్య జనవరి 17న రీరిలీజ్ కానుంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. అప్పట్లో స్టార్ హీరోలు లేకుండా చిన్న నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. రూ.2.5 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా రూ.15 కోట్ల వసూళ్లు సాధించి ఆర్జీవీ మేకింగ్ టాలెంట్ను మరోసారి రుజువు చేసింది. సత్య కథ ముంబై మాఫియా జీవితాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. సౌరభ్ శుక్లా, అనురాగ్ కశ్యప్ కథ అందించగా, రామ్ గోపాల్ వర్మ తన టేకింగ్తో సినిమా స్థాయిని విపరీతంగా పెంచారు. వర్మ తీసిన చిత్రాలకు ఉన్న ఫ్యాన్ బేస్ ఇప్పటికీ బలంగానే కొనసాగుతోంది. 1998లో ఈ సినిమా దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుని, ఆర్జీవీకి మంచి పేరు తెచ్చింది. ఈ సూపర్ హిట్ గ్యాంగ్స్టర్ డ్రామా మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది.