వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీప బంధువు, వైఎస్ ప్రకాష్ రెడ్డి మనుమడు వైఎస్ అభిషేక్ రెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అభిషేక్ రెడ్డి హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ ఘటన కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
వైఎస్ అభిషేక్ రెడ్డి వైద్యవృత్తిలో స్థిరపడి విశాఖపట్నంలో సేవలు అందిస్తూ ఉన్నారు. పేషెంట్లకు సత్వర సేవలందిస్తూ, తన వృత్తిలో మంచి పేరు తెచ్చుకున్నారు. అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్నప్పటికీ, ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆశించిన కుటుంబ సభ్యులకు ఈ వార్త మింగుడుపడడం లేదు.
వైఎస్ అభిషేక్ రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు కావడం విశేషం. ఆయన కుటుంబంలో ఓ కొత్త తరం ప్రతినిధిగా ఎదిగే అవకాశం ఉన్న అభిషేక్ రెడ్డి అకాల మరణం అందరికీ కంటతడి పెట్టించింది. వైఎస్ కుటుంబానికి చెందిన వ్యక్తిగా మాత్రమే కాకుండా, వైద్యవృత్తి ద్వారా ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేసిన అభిషేక్ రెడ్డి మరణం అందరి హృదయాలను కలిచివేసింది. ఆయనకు శ్రద్ధాంజలి ఘటించడానికి పలువురు ప్రముఖులు కూడా అంత్యక్రియలకు హాజరవుతారని తెలుస్తోంది.