HMPV (హ్యూమన్ మెటాప్న్యుమో వైరస్) కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఈ వైరస్ కరోనా వైరస్కు భిన్నమని, అంత ప్రమాదకరం కాకపోయినా జాగ్రత్తలు అవసరమని వైద్యులు సూచించారు. HMPV ఒక సాధారణ ఇన్ఫ్లూయెంజాగా పరిగణించబడుతుందని, ఇది 4 నుంచి 7 రోజుల్లో తగ్గిపోతుందని గాంధీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
గాంధీ ఆసుపత్రిలో వైరస్ బాధితులకు తగిన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచారు. 600 ఆక్సిజన్ బెడ్స్, 450కి పైగా వెంటిలేటర్లు, 400 మానిటర్లు అందుబాటులో ఉన్నాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ వెల్లడించారు. పైగా, 40వేల లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు, వందలాది ఆక్సిజన్ సిలిండర్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. పిల్లల చికిత్స కోసం ప్రత్యేకంగా పీడియాట్రిక్ వెంటిలేటర్లను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఈ వైరస్ ప్రభావం చిన్న పిల్లలు, వృద్ధులు, కోమార్బిడిటీస్ ఉన్నవారిపై ఎక్కువగా పడుతోందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఇలాంటి వారు కోవిడ్ మాదిరిగా హెచ్చరికలను పాటించడం మంచిదని సూచించారు. తగిన ఆహారం, శుభ్రత, వ్యాయామంతో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం అవసరమని సూచించారు.
వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ప్రజలు అత్యవసర కారణాలు లేకుండా బహిరంగ ప్రదేశాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు కోరుతున్నారు. మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి సూచనలను అనుసరించాలన్నారు. చిన్న పిల్లల తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, వారికి స్వల్ప లక్షణాలు కనబడితే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు.
HMPV వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో ప్రభుత్వం దశలవారీగా చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు మరింత భరోసానిచ్చే విధంగా ఉండడంతో, బాధితులకు తగిన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి సిద్ధంగా ఉందని నిపుణులు వెల్లడించారు.