‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుగు ప్రయాణంలో ప్రమాదవశాత్తు మరణించిన ఇద్దరు అభిమానులకు నిర్మాత దిల్రాజు రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. శనివారం రాజమహేంద్రవరంలో ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే.
ఆ వేడుకలో పాల్గొని తిరిగి ఇళ్లకు వెళుతున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్(22) మరణించారు.ఇక ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే నిర్మాత దిల్రాజు మీడియా సమక్షంలో స్పందించారు.
ఆయన మాట్లాడుతూ.. ” ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఆ విషయంపై మేం సంతోషంగా ఉన్న సమయంలో ఇలా ఇద్దరు అభిమానులు తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో చనిపోవటం ఎంతో బాధాకరం. వారి కుటుంబాలకు నేను అండగా ఉంటాను.
నా వంతుగా వారి కుటుంబాలకు చెరో రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాను. ఇలాంటి ఘటన జరిగినప్పుడు కుటుంబాల్లో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగలను. వారికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను” అని అన్నారు.