తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు ఓ ముఖ్య విషయాన్ని తెలియజేశారు. మంగళవారం శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించబోతున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. జనవరి 10 నుంచి 19 వరకూ పదిరోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు అధికారులు ఎప్పుడో ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ద్వార దర్శనాలను పురస్కరించుకుని జనవరి ఏడో తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్బంగా జనవరి ఏడో తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆరో తేదీన సిఫార్సు లేఖలను స్వీకరించడం లేదని ఓ ప్రకటనలో చెప్పింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది.
మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయంలో ఏడాదికి నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం, ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాల సమయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేస్తారు. ఆయా పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని టీటీడీ ఆగమోక్తంగా చేపడుతుంది.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా మంగళవారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అర్చకులు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆనంద నిలయం నుంచి బంగారు వాకిలి వరకు శుభ్రం చేస్తారు. ఇక ఆలయాన్ని శుద్ధి చేసే సమయంలో శ్రీవారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా మూసివేస్తారు. ఆ తరువాత ఆలయ శుద్ధి అనంతరం సుగంధ ద్రవ్యాలు కలిపిన పరిమల జలంతో ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు.