ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తల్లికి వందనం పథకం అమలు ఇప్పట్లో లేదని తెలుస్తున్నది. దీనితో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కారణం.. తల్లికి వందనం పథకాన్ని ఈ సంవత్సరం అమలు చెయ్యట్లేదనే వార్త బయటకు రావడమే. దీన్ని 2025 విద్యా సంవత్సరం నుంచి అమలు చెయ్యాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అంటే.. 2025 జూన్లో ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉంది. మరి 2024 విద్యా సంవత్సరం సంగతేంటి? ఈ విద్యా సంవత్సరానికి ఇవ్వాల్సిన డబ్బు సంగతేంటి? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
అప్పులు చేసిన తల్లిదండ్రులు
తల్లికి వందనం పథకం కింద.. ప్రతీ విద్యార్థికీ రూ.15,000 చొప్పున ఇస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీలు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక, మొదటి ఆర్థిక లేదా విద్యా సంవత్సరంలో ఈ పథకాన్ని అమలు చెయ్యట్లేదని తెలుస్తోంది. ఈ పథకం అమలవుతుందనే ఆలోచనతో.. చాలా మంది తల్లిదండ్రులు.. తమ పిల్లల స్కూళ్ల ఫీజుల కోసం అప్పులు చేశారు.
వైసీపీ ప్రభుత్వం కూడా కాలయాపన
గత వైసీపీ ప్రభుత్వం కూడా ఇదే తప్పు చేసింది. ఎన్నికల ఏడాదిలో… అప్పటి సీఎం జగన్.. చివరి ఏడాది ఇవ్వాల్సిన అమ్మఒడి డబ్బు ఇవ్వలేదు. అలాగే కాలయాపన చేశారు. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో.. డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టారు.
ఆ విద్యా సంవత్సరం కూడా తల్లిదండ్రులు అప్పులు చేసి, పిల్లల స్కూల్ ఫీజులు కట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా మనీ ఇవ్వకపోవడంతో.. రెండోసారి మళ్లీ అప్పులు చేసి, ఫీజులు కడుతున్నారు.
పోటి రాజకీయాలతో ప్రజలకు ఇబ్బంది
గత ప్రభుత్వంలో జగన్.. ఒక బిడ్డ చదువుకే రూ.13,000 చొప్పున ఇస్తూ వచ్చారు. ఐతే.. అందులో రూ.2,000 కోత పెట్టి.. ఆ డబ్బును స్కూళ్లలో పారిశుధ్యం కోసం వాడారు. ఇలా మూడేళ్లు ఇచ్చారు. తర్వాత ఎన్నికలు ఏడాదిలో ఇవ్వకుండా తాత్సారం చేసి.. చివరకు ఊరుకున్నారు.