ఒడిశా గవర్నర్ రఘుబర్దాస్ రాజీనామాతో.. ఆయన స్థానంలో కంభంపాటి హరిబాబు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చక్రధారి శరణ్ సింగ్ ప్రమాణం చేయించారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కంభంపాటి హరిబాబు 2021 జులైలో తొలిసారి మిజోరం గవర్నర్గా నియమితులైన విషయం తెలిసిందే. రాజధాని భువనేశ్వర్లోని రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్, మాజీ సీఎం నవీన్ పట్నాయక్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.
ఒడిశా గవర్నర్ రఘుబర్దాస్ రాజీనామాతో.. ఆయన స్థానంలో కంభంపాటి హరిబాబును నియమిస్తూ గతేడాది డిసెంబర్లో కేంద్రం ప్రకటించింది. అదేవిధంగా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఇవాళ మణిపూర్ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లోని దర్బార్ హాల్లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది.
ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నరులు
దేశంలోని ఐదు రాష్ట్రాలకు కేంద్రం గవర్నర్లను నియమించిన విషయం తెలిసిందే. బీహార్ గవర్నర్గా ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, కేరళ గవర్నర్గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ఒడిశా గవర్నర్గా కంభంపాటి హరిబాబు, మిజోరం గవర్నర్గా జనరల్ విజయ్ కుమార్ సింగ్, మణిపూర్ గవర్నర్గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను నియమించింది.