ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తూ అరెస్ట్ చేస్తున్నది. వారిపై అక్రమ కేసుల్ని పెట్టి ఇబ్బందికి గురిచేస్తున్నది. తాజా అంశంగా సజ్జల కుటుంబంపై విచారణకు ఆదేశం వెల్లడైంది, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబీకులు ప్రభుత్వ, పేదల భూములు కబ్జా చేశారంటూ పెద్దఎత్తున ఆరోపణలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. సజ్జల రామకృష్ణారెడ్డి భూకబ్జాలపై వెంటనే విచారణ చేయాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. 52 ఎకరాల చుక్కల భూములు, ప్రభుత్వ భూములను సజ్జల కుటుంబీకులు కబ్జా చేశారనే ఆరోపణలు కొన్ని రోజులుగా గుప్పుమంటున్నాయి. ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చను లేవనెత్తింది.
పేదలు, ప్రభుత్వ భూముల జోలికి ఎవ్వరూ వచ్చిన సహించేది లేదని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు విచారణకు ఆదేశించి కబ్జాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని అటవీ, రెవెన్యూ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే తాను ఏ తప్పూ చేయలేదని, ఎటువంటి భూములను తాము ఆక్రమించలేదని సజ్జల బుకాయిస్తున్నారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో అధికారులు విచారణ నిమిత్తం రంగంలోకి దిగారు. ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు భూములను సర్వే చేస్తున్నారు. మరోవైపు, ఈ భూముల్లోనే సజ్జల గెస్ట్ హౌస్ కట్టుకున్నట్టు తెలుస్తోంది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబానికి చెందిన భూములపై విచారణ జరిపించాలని ఆదేశించారు. గురువారం వైఎస్సార్ జిల్లా కలెక్టర్ను సంప్రదించి, అటవీ భూముల వివరాలు సేకరించి నివేదిక ఇవ్వాలని సూచించారు. అటవీ భూముల సంరక్షణ చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని పవన్ స్పష్టం చేశారు. సీకే దిన్నె ప్రాంతంలో 42 ఎకరాల అటవీ భూములున్నాయన్న సమాచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, పవన్ అటవీ అధికారులతో చర్చలు జరిపారు. సజ్జల కుటుంబం ఆక్రమించిన భూముల్లో రిజర్వ్ ఫారెస్ట్ భూములు ఉన్నాయా? ఎన్ని ఎకరాలు ఆక్రమించారనే వివరాలతో నివేదికలను అందించాలంటూ కడప కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విచారణలో ఏవిధమైన నిజాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాల్సి ఉంది. ఒకవేళ సజ్జల నిజంగానే అడవులను ఆక్రమించినట్లు తేలితే, ఆయనపై చర్యలు తప్పవని అర్థమవుతోంది.