అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఆయన యల్లమందలోని పింఛను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి సీఎం స్వయంగా పింఛను అందజేశారు. శారమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లిన సీఎం పింఛను నగదు ఇచ్చి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. శారమ్మ కుమార్తెకు నీట్ కోచింగ్ ఇప్పించాలని సీఎం అధికారులకు సూచించారు. శారమ్మ కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం ఇప్పించాలని ఆదేశించారు. దూర విద్య ద్వారా చదువు కొనసాగించాలని శారమ్మ కుమారుడికి సూచించారు.
ఆ తర్వాత సీఎం చంద్రబాబు మరో లబ్ధిదారుడు ఏడుకొండలు ఇంటికి వెళ్లారు. ఏడుకొండలు ఇంట్లో చంద్రబాబు స్వయంగా కాఫీ తయారు చేశారు. తాను పెట్టిన కాఫీని ఏడుకొండలు కుటుంబ సభ్యులకు ఇచ్చారు. అనంతరం ఏడుకొండలు కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దుకాణం పెట్టుకునేందుకు కుటుంబానికి బీసీ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల రుణం ఇవ్వాలని ఆదేశించారు.
కాగా, ఒకటో తేదీకి ఒకరోజు ముందుగానే ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లను అందిస్తోంది. ఈ ఉదయం నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. 63,77,943 మంది లబ్ధిదారులకు పింఛన్ల కోసం రూ. 2,717 కోట్లను విడుదల చేసింది. ఈ ఉదయం నుంచి ఇప్పటి వరకు 90 శాతం మందికి పింఛన్లను పంపిణీ చేశారు.