కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ మహిళలు సొంతంగా ఉపాధి పొందేందుకు కుట్టుపని ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఐతే.. ఈ పథకంపై అనుమానాలు కలుగుతున్నాయి. ఇందులో భారీ స్కామ్ జరగబోతోందనే అంచనాలు వస్తున్నాయి.
అలాగే.. 80వేల మంది బీసీ మహిళలకు.. ట్రైనింగ్ తర్వాత రూ.24వేల విలువైన కుట్టు మిషన్లను ఉచితంగా ఇవ్వాలి అని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి పక్కా ప్లాన్ రెడీ చెయ్యమని బీసీ సంక్షేమ శాఖను ఆదేశించింది.
90 రోజులపాటూ ట్రైనింగ్
బీసీ మహిళళకు టైలరింగ్లో ట్రైనింగ్ ఇచ్చేందుకు.. కొన్ని సంస్థల నుంచి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఆ సంస్థలు స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఇందులో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా 80,000 మంది బీసీ మహిళలకు.. కుట్టుపనిలో 90 రోజులపాటూ ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత ఒక్కో మహిళకూ రూ.24,000 విలువగల కుట్టుమిషన్ని ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. ఇక్కడే ఈ పథకంపై అనుమానాలు కలుగుతున్నాయి.
పలు అనుమానాలు
కుట్టుమిషన్ ధరను ప్రభుత్వం రూ.24,000గా ఎందుకు నిర్ణయిస్తోంది అనేది తేలాల్సిన అంశం. కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మయోజన పథకంలో భాగంగా.. ఉచితంగా కుట్టుమిషన్ కొనుక్కోవడానికి రూ.15,000 ఇస్తోంది. అంటే.. రూ.15,000కి కుట్టుమిషన్ వస్తుంది. మార్కెట్లో సంప్రదాయ కుట్టుమిషన్ ధర రూ.10,000 నుంచి రూ.15,000 దాకా ఉంటోంది. అదే.. ఎలక్ట్రిక్ కుట్టుమిషన్ ధర రూ.20,000లోపే ఉంటోంది. మరి ఏపీ ప్రభుత్వం ఎందుకు కుట్టుమిషన్ ధరను రూ.24,000గా చెబుతోంది అనే ప్రశ్న తెరపైకి వస్తోంది.