దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మండిపడ్డారు. తమ పార్టీ ప్రతిపాదించిన పథకాలను ఆపేందుకు ఈ రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలపై కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ ఫిర్యాదు చేశారు. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా విచారణకు ఆదేశించారు.
కాగా, అరవింద్ కేజ్రీవాల్ శనివారం దీనిపై స్పందించారు.
బీజేపీ, కాంగ్రెస్లపై మండిపడ్డారు. ఢిల్లీ ఎన్నికలకు ముందు మహిళలు, వృద్ధుల కోసం ఆప్ ప్రతిపాదించిన పథకాలను ఆపడానికి రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ‘బీజేపీకి నేరుగా వ్యవహరించే ధైర్యం లేకపోవడంతో కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్తో ఫిర్యాదు చేయించింది. ఆప్ను అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి’ అని మీడియాతో అన్నారు.
మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మహిళలకు రూ.2,100, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత వైద్యం అందిస్తామని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ రెండు పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. ‘ఇప్పటికే లక్షల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. దీనిపట్ల బీజేపీ భయాందోళనలకు గురవుతోంది’ అని ఆయన విమర్శించారు.