బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్చి నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటీషన్ పై మచిలీపట్నం జిల్లా కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జయసుధ, ప్రభుత్వం తరపున వాదనలు పూర్తయ్యాయి, దీంతో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు జిల్లా కోర్టు ప్రకటించింది. డిసెంబర్ 30వ తేదీన దీనిపై తీర్పు ఇస్తామని మచిలీపట్నంలోని జిల్లా కోర్టు స్పష్టం చేసింది. జయసుధ తరఫు న్యాయవాదులు తమ వాదన వినిపిస్తూ.. గోడౌన్లో బస్తాల షార్టేజ్ వచ్చినట్లు గుర్తించి.. నవంబర్ 27వ తేదీన ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. అయితే డిసెంబర్ 3, 4 తేదీల్లో గోడౌన్లో తనిఖీలు నిర్వహించి.. 10వ తేదీన డిమాండ్ నోటీసు ఇచ్చారని కోర్టుకు వివరించారు. అనంతరం డిసెంబర్ 12వ తేదీన కేసు నమోదు చేశారని కోర్టుకు విన్నవించారు. ఈ అంశంలో తామే ముందు కనుగోని.. ప్రభుత్వానికి చెప్పామని.. అనంతరం అధికారులు మెల్కొన్నారని తెలిపారు. ఇక వే బ్రిడ్జి లో సాంకేతిక సమస్య కారణంగా తూకంలో సైతం తేడా వచ్చిందని కోర్టు లో ఈ సందర్భంగా న్యాయవాదులు వివరించారు. ఆ క్రమంలో ఈ కేసులో జయసుధకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టుకు ఆమె తరపు న్యాయవాదులు తెలిపారు. అయితే బియ్యం మాయం అయినట్లు నేరుగా వారే అంగీకరించడం.. ఆ క్రమంలో నోటీసుల జారీ చేసిన నేపథ్యంలో రూ. కోటి 70 లక్షలు ప్రభుత్వానికి చెక్కు ద్వారా చెల్లించారని కోర్టుకు గుర్తు చేశారు. నేరం చేసి.. నగదు చెల్లించామని.. దీంతో కేసు మాఫీ చేయాలంటూ కోరుతున్నట్లుగా జయసుధ తరపు న్యాయవాదులు చెబుతున్నట్లుగా ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాదులు స్పష్టం చేశారు. ఈ ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. ఈ తీర్పును రిజర్వు చేస్తున్నట్లు తెలిపింది. ఆ క్రమంలో డిసెంబర్ 30వ తేదీన దీనిపై తీర్పు వెలువరిస్తామని కోర్టు ప్రకటించింది