అమరావతి: ఏపీలోని కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపుపై నేడు(శుక్రవారం) ప్రతిపక్ష వైసీపీ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సైతం వైసీపీ సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం పవర్ లోకి వచ్చి 6 నెలలు కాకముందే ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపిందని ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తున్నది.
వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో వైసీపీ శ్రేణులు ఆందోళనకు సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ర్యాలీలు, వినతిపత్రాల సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. చంద్రబాబు ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పాటు మెమోరాండం సమర్పించేందుకు సిద్ధమయ్యారు.
కాగా, అయితే 2022-23 సంవత్సరానికి ఇంధన సర్దుబాటు పేరుతో రూ. 6200 కోట్లకు ఈఆర్సీ ఆమోదం తెలిపింది. బాదుడే బాదుడు అంటూ గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన కూటమి పార్టీలు.. అధికారంలోకి రాగానే విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. విద్యుత్ ఛార్జీల పెంపుపై వామపక్షాలు, విద్యుత్ వినియోగాదారుల సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.