తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుపతి, తిరుమలలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. జనవరి 10, 11, 12వ తేదీలకు సంబంధించి మొదటి మూడు రోజులకు జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటల నుండి 1.20 లక్షల టోకెన్లు భక్తులకు జారీ చేస్తామని, తదుపరి రోజులకు ఏరోజుకారోజు ముందు రోజు టోకెన్లు జారీ చేస్తామని ఈవో తెలిపారు.
తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి, భూదేవి కాంప్లెక్స్, జీవకోన హైస్కూల్, ఇందిరా మైదానం , శ్రీనివాసం, విష్ణునివాసం, బైరాగిపట్టెడలోని రామానాయుడు స్కూల్, ఎంఆర్ పల్లి స్కూల్లతో పాటు(తిరుమలలో బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో తిరుమల స్థానికుల కొరకు) కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 91 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులు తమ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని, టోకెన్లు పొందిన భక్తులకు ఈసారి వారి ఫోటో గుర్తింపుతో కూడిన స్లిప్లను జారీ చేస్తామని తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజులలో శ్రీవారి దర్శనం ఉండదని తెలిపారు.
కౌంటర్లు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామని, వేచి ఉండే భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. సర్వదర్శనం టోకెన్ల కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న కౌంటర్ల కేంద్రాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, టీటీడీ జేఈవో గౌతమి, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, సివిఎస్వో శ్రీధర్లతో కలిసి ఈవో తనిఖీ చేశారు. ఈవో వెంట సీఈ సత్యనారాయణ, ఎస్ఈ వెంకటేశ్వర్లు, మనోహర్, ట్రాన్స్పోర్ట్ జీఎం శేషారెడ్డి, తదితర టీటీడీ అధికారులు, పోలీసు, రెవెన్యూ అధికారులు ఉన్నారు.