ఆంధ్రప్రదేశ్లో మహిళలపై రాజకీయ నేతల అనుచరుల వేధింపులు మరోసారి వెలుగులోకి వచ్చాయి. తిరుపతి జిల్లాకు చెందిన ఓ మహిళపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరుడైన మందల వెంకట శేషయ్య లైంగిక దాడికి పాల్పడిన ఘటన చర్చనీయాంశంగా మారింది. బాధితురాలు గతంలో ఉద్యోగం కోసం సహాయం కోరగా, అతడు తన అధికారాన్ని ఉపయోగించి మహిళను లైంగికంగా వేధించాడు. 2021లో భర్తను కోల్పోయిన బాధితురాలు, కుటుంబ పోషణ కోసం భర్త ఉద్యోగాన్ని కోరింది. అయితే అత్తమామల ఒత్తిడితో ఉద్యోగం విషయమై గొడవలు చోటుచేసుకున్నాయి.
పరిస్థితిని చక్కదిద్దుతున్నట్టుగా నటించిన వెంకట శేషయ్య, ఉద్యోగం పొందేందుకు తన కోరికలు తీర్చాలని మహిళను బలవంతం చేశాడు. ఉద్యోగం కోసం వెంకట శేషయ్య చెప్పినట్లుగా చేయాల్సి వచ్చింది. ఆ తరువాత కూడా అతడు తన వేధింపులు ఆపకుండా, ఆమెను పలుమార్లు లైంగిక దాడికి గురిచేశాడు. బాధితురాలు 2022లో సూల్లూరుపేటకు బదిలీ అయినప్పటికీ, వెంకట శేషయ్య వేధింపులు ఆగలేదు. వేధింపులు మరింత ఎక్కువవుతుండడంతో, బాధితురాలు వెంకటాచలం పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తన జీవితాన్ని క్షీణింపజేసిన వెంకట శేషయ్యపై అన్ని వివరాలను పోలీసులకు చెప్పింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.