అమరావతి: నేడు కడప జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రానున్నారు. ఈ మేరకు ఆయన నాలుగు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఆయన బెంగళూరు నుంచి ఇడుపులపాయకు చేరుకోనున్నారు. తొలుత ఆయన తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళి అర్పిస్తారు. ఆ తర్వాత ప్రేయర్ హాల్ లో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం కడప నియోజకవర్గ నేతలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు పులివెందులకు బయల్దేరుతారు. రాత్రికి పులివెందులలోని నివాసంలో బస చేస్తారు.
రేపు జగన్ పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొననున్నారు. 26వ తేదీ పులివెందులలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. 27వ తేదీ ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్స్ లో జరిగే వివాహానికి హాజరవుతారు. ఆ తర్వాత పులివెందుల నుంచి జగన్ బెంగళూరుకు తిరుగుపయనమవుతారు.