వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజు విజయాన్ని ప్రశంసిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ట్వీట్ వివాదానికి కారణమైంది. ట్వీట్లో గుకేశ్ తెలుగువాడని పేర్కొనడంపై తమిళ నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గుకేశ్ తమిళుడని, చంద్రబాబు వ్యాఖ్యలు సరికావని వారు తేల్చారు. ఈ నేపథ్యంలో ట్వీటర్ వేదికగా తెలుగు-తమిళ నెటిజన్ల మధ్య మాటల యుద్ధం చెలరేగింది.
తమిళ నెటిజన్లు గుకేశ్ చెన్నైకి చెందిన వ్యక్తి అని తెలియజేస్తూ, ఆయన తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తింపు పొందాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి కౌంటర్గా తెలుగు నెటిజన్లు గుకేశ్ వికీపీడియా పేజీని షేర్ చేస్తూ, ఆయన తల్లిదండ్రులు తెలుగు వారని, గుకేశ్ తెలుగు మూలాలున్న వ్యక్తేనని సమాధానం ఇస్తున్నారు. ఈ వాదనలు రెండు వర్గాల మధ్య మరింత వేడెక్కాయి.
గుకేశ్ వివరాలను పరిశీలిస్తే, ఆయన తమిళనాడులోని చెన్నైలో స్థిరపడి ఉండడం నిజమే. అయితే ఆయన కుటుంబం తెలుగునాట కలిగి ఉందని, పలువురు వ్యాఖ్యాతలు వెల్లడిస్తున్నారు. ఇదిలా ఉంటె దొమ్మరాజు గుకేశ్ అతి చిన్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా పేరు పొందాడు. గురువారం జరిగిన ఆఖరిదైన 14వ గేమ్లో నల్లపావులతో బరిలోకి దిగిన ఈ 18 ఏండ్ల కుర్రాడు..లిరెన్(6.5)ను కట్టిపడేస్తూ 7.5 పాయింట్లతో టైటిల్ ఒడిసిపట్టుకున్నాడు. గేమ్కు ముందు ఇద్దరు 6.5 పాయింట్లతో సమంగా ఉండగా, విజేతను నిర్ణయించే ఈ పోరులో గుకేశ్కు అదృష్టం కలిసోచ్చింది. నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఫైనల్ గేమ్ పోరు 58 ఎత్తుల్లో ముగిసింది. అప్పటి వరకు కనీసం డ్రా కోసమైనా ప్రయత్నం చేద్దామనుకున్న గుకేశ్కు లిరెన్ చేసిన ఘోర తప్పిదం ప్రపంచ విజేతగా నిలిచేలా చేసింది.