మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవలే “మట్కా” సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో కొంత విరామం తీసుకున్న వరుణ్ తేజ్ తాజాగా భక్తి మార్గంలో అడుగుపెట్టారు. తాజాగా హనుమాన్ మాలను ధరించి ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా దర్శనమిచ్చారు.మెగా కుటుంబానికి దేవుడిపై గాఢమైన విశ్వాసం ఉండడం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తరచూ అయ్యప్ప మాలను ధరించి దీక్షలు తీసుకుంటారు. అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా గతంలో పలు సందర్భాల్లో దీక్షలు చేపట్టారు. ఇప్పుడు వరుసలోకి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా వచ్చారు. హనుమాన్ మాలను ధరించిన వరుణ్ మంగళవారం (డిసెంబర్ 03) జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.వరుణ్ ఆలయానికి చేరుకున్న వెంటనే అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం స్వామి వారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాముఖ్యతను, అంతరాలయ విగ్రహ విశిష్టతను వరుణ్కి వివరించారు. ఈ దర్శనానంతరం మాట్లాడిన వరుణ్ తేజ్, “కొండగట్టు అంజన్న చాలా పవర్ఫుల్ దేవుడు. హనుమాన్ మాలను తొలిసారి ధరించిన నాకు ఆయనను దర్శించుకోవడం ఎంతో భాగ్యంగా భావిస్తున్నా,” అని అన్నారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇదిలా ఉంటే, వరుణ్ తేజ్ తాజా చిత్రం “మట్కా” ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. పలాస 1978 ఫేం కరుణకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేకపోయినా, వరుణ్ తేజ్ నటనకు ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. డిసెంబర్ 05 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఈ ఆధ్యాత్మిక యాత్ర ద్వారా వరుణ్ తేజ్ తన అభిమానులను సంతోషపరచడంతో పాటు, భక్తి మార్గంలో కూడా తన దారిని చూపించారు.