ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో 46 ఏళ్లుగా మూతబడిన ఓ పురాతన శివాలయం వెలుగులోకి వచ్చింది. 1978లో సంభాల్లో జరిగిన అల్లర్ల కారణంగా హిందూ కుటుంబాలు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయాయి. దీంతో ఆలయం మూసివేయబడింది.ఆలయాన్ని ఆక్రమణదారులు తమ ఆధీనంలోకి తీసుకోవడంతో ఆలయ ప్రాంగణం పూర్తిగా చెదిరిపోయింది.అయితే, ఇటీవల అధికారులు తీసుకున్న చర్యలతో ఆలయం మరల దర్శనమిచ్చింది.సంభాల్ జిల్లా ఖగ్గు సరాయ్ ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. స్థానిక పరిపాలన అధికారులకు ఆలయంపై ఆక్రమణల గురించి సమాచారం అందింది.వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేస్తూ, శివలింగం, హనుమాన్ విగ్రహాలను వెలికితీశారు.అంతేకాదు, ఆలయ ప్రాంగణంలో ఒక పురాతన బావి, అదనంగా మూడు విగ్రహాలు కూడా బయటపడ్డాయి. ఈ ఆలయాన్ని “కార్తీక శంకర ఆలయం”గా గుర్తించారు. ఇంతకుముందు ఈ ప్రాంతంలో హిందువుల ఆధిపత్యం ఉండేదని,ఈ ఆలయం వారి ఆధ్యాత్మిక కేంద్రమని 82 ఏళ్ల విష్ణు శరణ్ రస్తోగి గుర్తుచేశారు.
1978లో జరిగిన అల్లర్ల తర్వాత హిందూ కుటుంబాలు భయంతో ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయాయని, అప్పటి నుంచి ఆలయం నిర్లక్ష్యానికి గురైందని చెప్పారు.అప్పట్లో ఈ ప్రాంతంలో 42 హిందూ కుటుంబాలు నివసించేవి. ప్రతి ఉదయం, సాయంత్రం ఈ ఆలయంలో పూజలు జరిగేవి. ఆలయ ప్రాంగణంలోని రావిచెట్టు కింద ప్రజలు కీర్తనలు చేసేవారని స్థానికులు గుర్తు చేసుకున్నారు. కానీ 1978లో అల్లర్ల తర్వాత, చుట్టుపక్కల ముస్లిం జనాభా పెరగడంతో, భయపడిన హిందువులు ప్రాణాలతో ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లారు. ఆలయం ప్రదక్షిణ మార్గం ఆక్రమణకు గురైనప్పటికీ, అధికారుల చర్యలతో అది మళ్లీ శుభ్రపరచబడింది. ఇప్పుడు ఈ ఆలయం 300 సంవత్సరాల చరిత్రను చూపిస్తూ నూతన జీవం పొందుతోంది. శివలింగం, హనుమాన్ విగ్రహాలు, పాతకాలపు బావి, అదనంగా బయటపడిన విగ్రహాలు ఈ ఆలయ మహత్తును వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఆలయ తవ్వకాల్లో మరిన్ని పురాతన ఆనవాళ్లు బయటపడుతున్నాయి.