బీజాపూర్‌లో పోలీసుల ముందు లొంగిపోయిన 25 మంది మావోలు

25 Maoists who surrendered before the police in Bijapur

బీజాపూర్: ఛత్తీస్‌ఘడ్ లో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో 25 మంది నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో అయిదు గురిపై రూ.28 లక్షల రివార్డులు ఉన్నాయి. లొంగిపోయిన మావోయిస్టుల గురించి బీజూపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ వివరాలు మీడియాకు వెల్లడించారు. లొంగిపోయిన నక్సలైట్లు గంగ్లూర్ , బైరామ్‌గఢ్ ఏరియా కమిటీల్లో క్రియాశీలకంగా పని చేశారని చెప్పారు.

ఇద్దరు మహిళా నక్సలైట్ లు కూడా లొంగిపోయినవారిలో ఉన్నారని తెలిపారు. శంబరి మద్యం (23), జ్యోతి పునెం (27), మహేశ్ తేలంపై ఒక్కొక్కరి తలపై రూ.8 లక్షల చొప్పున రివార్డు ఉందని చెప్పారు. శంబరి మద్యం అనే మహిళ 2012లో నుండి ఉద్యమంలో కీలకంగా పని చేశారనీ, 2020లో సుక్మా జిల్లాలో, 2021లో బిజాపూర్ లో భద్రతా సిబ్బందిపై జరిగిన భారీ దాడుల ఘటనల్లో ఆమె పాత్ర ఉందని ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన విష్ణుకర్తమ్ అలియాస్ మోను, జైదీప్ పాడియంలపైనా రివార్డులు ఉన్నాయన్నారు.

మావోయిస్టు భావజాలం పట్ల నిరాశ, ఉద్యమ నేతల దౌర్జన్యాల కారణంగా వీరు లొంగిపోయినట్లు ఎస్పీ చెప్పారు. లొంగిపోయిన వీరికి రూ.25వేల చొప్పున సాయంతో పాటు ప్రభుత్వ పాలసీ ప్రకారం పునరావాసాన్ని కల్పిస్తామని ఎస్పీ తెలిపారు. బీజాపూర్ జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకూ 346 మంది నక్సలైట్ లను అరెస్టు చేయగా, 170 మంది లొంగిపోయారని ఆయన తెలిపారు.