కేంద్రం ఏపీఎస్ ఆర్టీసీకి 750 బస్సుల్ని పంపిస్తుందని తెలిపారు అధికారులు. ఈ బస్సుల్ని ఏపీలోని వివిధ నగరాలకు రానున్నాయి.విశాఖపట్నం, నెల్లూరు, విజయవాడ, గుంటూరు, కర్నూలు, కాకినాడ, రాజమహేంద్రవరం, కడప, అనంతపురం, తిరుపతి, మంగళగిరికి బస్సుల్ని కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అయితే విశాఖపట్నంలో ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధమవుతున్నారు. నగరానికి నాలుగు విడతల్లో మొత్తం 200 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. మొదటి విడతలో 50 బస్సులు త్వరలో వస్తున్నట్లు చెబుతున్నారు. ఆర్టీసీ ఈ బస్సులను సింహాచలం, గాజువాక, మధురవాడ డిపోల నుంచి నడపాలని నిర్ణయించారు.ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రత్యేక డిపోలను(Special Depo) ఏర్పాటు చేస్తున్నారు. గాజువాక డిపో వెనుక ఐదు ఎకరాల్లో, సింహాచలం డిపో వెనుక నాలుగు ఎకరాల్లో ఈ బస్సుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రెండు డిపోల నుంచి మొదటి విడత ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు ఈ స్థలాలను పరిశీలించి, ఈ-గ్యారేజీ నిర్వహణకు, ఛార్జింగ్ కు ఎంత విద్యుత్ అవసరమో అంచనా వేశారు. ఎంత కెపాసిటీ కలిగిన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలో కూడా నిర్ణయించారు. త్వరలో ఈ రెండు ప్రాంతాలకు విద్యుత్, ట్రాన్స్ఫార్మర్లు, ఛార్జింగ్ పరికరాలు ఏర్పాటు చేస్తామంటున్నారు. రెండో విడతలో మధురవాడ డిపోను ఈ-బస్సుల డిపోగా మారుస్తామంటున్నారు.
రెండో దశ
మొదటి విడతలో వచ్చిన ఈ-బస్సులను గాజువాక, సింహాచలం డిపోల నుంచి నగరంలోని ప్రధాన రహదారుల్లో నడపాలని ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. సింహాచలం నుంచి ద్వారకా కాంప్లెక్స్, పాత పోస్టాఫీస్, ఆర్కే బీచ్, సింథియా ప్రాంతాలకు బస్సులు నడుపుతారు. గాజువాక నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్, ఆర్కే బీచ్, సింహాచలం, పెందుర్తి ప్రాంతాలకు బస్సులు నడుపుతారు. రెండో దశలో రానున్న ఈ-బస్సులను ఇతర రూట్లలో నడపాలని నిర్ణయించారు. ఎలక్ట్రిక్ బస్సులతో(Electric Buses) నిర్వహణ ఖర్చు తక్కువ, నగరంలో కాలుష్యం తగ్గుతుంది అంటున్నారు. స్మార్ట్ సిటీ స్థాయికి తగ్గట్టు బస్సులు ఉండాలన్న ఉద్దేశంతో ఎలక్ట్రిక్ బస్సుల ప్రతిపాదన చేశారు.

ప్రతిపాదన
ప్రస్తుతం ఆర్టీసీలో చాలా పాత బస్సులు ఉన్నాయి. వాటి స్థానంలో కొత్త బస్సులు కొనాలని భావిస్తున్నారు. ప్రయాణికులకు ఊరట కలిగించేందుకు 900 డీజిల్ బస్సులను కొనాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రజా రవాణా శాఖ (పీటీడీ) ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కాకపోతే గతంలో కొత్తగా విద్యుత్ బస్సులు మాత్రమే తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇందులో భాగంగా కేంద్రం కొంత సహాయం అందించే పీఎం ఈ-బస్ సేవా పథకం కింద రాష్ట్రంలో 11 నగరాలకు 750 విద్యుత్ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకుంటున్నారు. పుణేకు చెందిన పినాకిల్ మొబిలిటీ సొల్యూషన్స్ వీటిని సరఫరా చేసి, నడపనుంది. కొద్దిరోజుల కిందట ఈ సంస్థకు ఆర్టీసీ లెటర్ ఆఫ్ ఇండెంట్ ఇచ్చింది. ఇంకా ఒప్పందం జరగాల్సి ఉంది. ఈ విద్యుత్ బస్సులు ఆర్టీసీలోకి వచ్చి చేరేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది.
Read Also : Heritage Curd: పెరుగు ప్యాకెట్ ల విషయం లో హెరిటేజ్ వివరణ