గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్‌

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. 6 గంటల పాటు భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఎదురుకాల్పుల్లో ఎస్ఐతో సహా ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని వండోలి గ్రామం పరిసర ప్రాంతాల్లో మావోయిస్టుల కదలిక సమాచారంతో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. మావోయిస్టులు కాల్పులు జరపడంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపి, వారి దాడుల్ని తిప్పి కొట్టారు.

గడ్చిరోలి పోలీసులు, సీ60 కమాండోలు ఈ భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఛత్తీస్ గఢ్, గడ్చిరోలి సరిహద్దుల్లో లోని కాంకేర్ సమీపంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని సమాచారం అందడంతో పోలీసులు, కమాండోలు రంగంలోకి దిగారు. డిప్యూటీ ఎస్పీ ఈ సెర్చ్ ఆపరేషన్‌కు నేతృత్వం వహించగా.. బలగాల రాకను గుర్తించిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. వెంటనే బలగాలు అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 12 మంది మావోయిస్టులు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మరికొందరు మావోయిస్టులు పరారయ్యారని, వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగించనున్నారు.