భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ముదురుతున్న సమయంలో పాకిస్తాన్ సైన్యానికి అంతర్గతంగానే మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తాజా ఘటనలో సౌత్ వజిరిస్థాన్ ప్రాంతంలో తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ఉగ్రవాదుల కాల్పుల్లో పాక్ సైనికులు 10 మంది హతమయ్యారు. ఈ దాడికి సంబంధించిన థర్మల్ ఇమేజింగ్ వీడియోను TTP స్వయంగా విడుదల చేయడం గమనార్హం. ఈ వీడియోలో ఘర్షణ దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
ఈ ఘటనపై పాకిస్థాన్ అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పాక్ అంతర్గత వర్గాలు అంచనా వేస్తున్నాయి. పాక్ భద్రతా వ్యవస్థలపై TTP ఇటీవలి కాలంలో వరుస దాడులు కొనసాగిస్తూ వస్తోంది. ప్రత్యేకించి వజిరిస్థాన్, ఖైబర్ పఖ్తూన్ ఖ్వా వంటి ప్రాంతాల్లో తీవ్రవాద శక్తుల ప్రభావం గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది.
సరిహద్దుల వద్ద కూడా పాక్ సైన్యానికి తీవ్ర ఒత్తిడి
ఇక మరోవైపు బలోచిస్థాన్ ప్రాంతంలో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) కూడా పాకిస్తాన్ ఆర్మీపై దాడులతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ భద్రతా వ్యవస్థలు ఏకకాలంలో దేశ విదేశీ సమస్యలతోపాటు అంతర్గత తీవ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాయి. దీనివల్ల సరిహద్దుల వద్ద కూడా పాక్ సైన్యానికి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Read Also : BCCI : ఐపీఎల్ వాయిదా..టికెట్ల సొమ్మును వాపసు