కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్.. మూసీ నిర్వాసితుల ఇళ్ల కూల్చివేతను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.మీడియాతో మాట్లాడుతూ.. “కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటీఎంలా మార్చుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నదిని కూడా ఏటీఎంలా మార్చుకునే ప్రయత్నాలు చేస్తోంద”ని విమర్శించారు.
మూసీ ప్రక్షాళన పేరుతో పరివాహక ప్రాంతంలోని నిరుపేదల ఇళ్లను కూల్చివేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వానికి మూసీ ప్రాజెక్టు పేరుతో లక్షన్నర కోట్ల రూపాయల అప్పు తీసుకోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, “వడ్డీల రూపంలో పది నెలల్లోనే రూ.60 వేల కోట్లు చెల్లించామని” వివరించారు. “పాలకులు చేస్తున్న అప్పుల కారణంగా రాష్ట్రంపై, ప్రజలపై భారం పడుతోంది” అని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు సహా హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని చెప్పారు.
బీజేపీ మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకంగా లేదని, అయితే “ఈ ప్రభుత్వ దోపిడీ, హైడ్రా పేరుతో పేదల ఇళ్ల కూల్చివేతకు మాత్రం తాము వ్యతిరేకమ”న్నారు. ఈ పరిస్థితులను నిరసిస్తూ రేపు ఇందిరా పార్క్ వద్ద పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టనున్నట్లు వెల్లడించారు.